శ్రీరామ నవమి పండగ సందర్భంగా ‘వారణాసి’ సినిమా థియేటర్స్లోకి రానుందట. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఫారెస్ట్ అడ్వెంచరస్ అండ్ మైథాలజీ యాక్షన్ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని 2027 వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు సంగీతదర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇటీవల జరిగిన ‘వారణాసి గ్లోబ్ట్రోటర్’ ఈవెంట్లో పేర్కొన్నారు. కానీ విడుదల తేదీపై మాత్రం సరైన స్పష్టత రాలేదు.
అయితే ఉగాది, శ్రీరామ నవమి పండగల సందర్భంగా ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 9న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ‘వారణాసి’ మూవీలో మహేశ్బాబు కొన్ని సన్నివేశాల్లో రాముడు పాత్రలో కనిపించనున్నారు. దీంతో శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే... ‘వారణాసి’ టైటిల్ టీజర్ను ప్యారిస్లోని ప్రముఖ రే గ్రాండ్ రెక్స్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ థియేటర్లో రజనీ కాంత్ ‘కబాలి’, ప్రభాస్ ‘బాహుబలి: ది కన్క్లూజన్’, ‘సాహో’ వంటి చిత్రాలను ప్రదర్శించారు. అయితే విడుదలకు ముందే ఓ సినిమా గ్లింప్స్ తరహా టీజర్ను ఈ థియేటర్లో ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ రికార్డ్ను ‘వారణాసి’ దక్కించుకుంది.


