ఇండస్ట్రీలోకి దిల్‌రాజు సతీమణి..!

Dil Raju Wife Tejaswini Turns Story Writer - Sakshi

కరోనా వైరస్‌ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. తొమ్మిది నెలల విరామం అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా.. ప్రేక్షకుడు మాత్రం ఆ వైపుకు కన్నెత్తికూడా చూడటంలేదు. మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ భయం దర్శక, నిర్మాతలను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో నిర్మించబోయే సినిమాలను ఓటీటీని వేదికగా చేసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారు. దీనికి అనుగుణంగానే కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ఆలోచనలకు పదునుపెడుతూ.. ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నారు. (కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా)

ఈ క్రమంలో టాలీవుడ్‌ బడా నిర్మాత దిల్‌రాజు సైతం ఓటీటీకి తగ్గకథల కోసం వెతుకులాట ఆరంభించారు. అయితే భర్త కోసం తన సతీమణి తేజస్వీని స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని చిత్రపరిశ్రమలో టాక్‌ వినిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె కొత్త కథలపై దృష్టిసారించారని, ఓటీటీకి అనుగుణంగా సృజనాత్మకతతో కూడిన ఓ కథను భర్తకు బహుమతిగా ఇచ్చారని సమాచారం. భార్య స్టోరీకి ఫిదా అయిన దిల్‌రాజు.. ఆ కథకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆమెకు సహాయంగా ఓ రచనా బృందాన్ని ఏర్పాటు చేశాడని తెలిసింది. (దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్‌, వెంకీ..!)


ఓటీటీ విస్తరిస్తున్న నేపథ్యంలో భార్య రూపొందించిన కథాంశాన్ని తెరక్కించాలని నిర్ణయించినట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అనుకున్నట్లు కథ కార్యరూపం దాల్చితే తేజస్వీని సైతం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్‌రాజు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తున్న ఎఫ్‌3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు. కాగా దిల్’రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని గత మార్చిలో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top