భాగ్యరాజ్ మరణం పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ అకాల మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఆయన మరణవార్త వినడం తనను తీవ్ర కలతకు గురిచేసిందని, ఇది నమ్మశక్యంగా లేదంటూ ఎక్స్ వేదికగా ఆయన సంతాపం ప్రకటించారు.
‘మాటల్లో చెప్పలేనంత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మొన్ననే మేమిద్దరం గోవాలో జరిగిన నటి కుష్బూ కుమార్తె వివాహ వేడుకలో కలుసుకున్నాం. అక్కడ ఎంతో నవ్వుతూ, సరదాగా జోకులు వేసుకుంటూ, కలిసి ఫోటోలు దిగాం. భాగ్యరాజ్ గారు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి ఈ ఉదయం ఇక లేరనే వార్త వినడం నన్ను తీవ్రంగా కలిచివేసింది’ అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
భాగ్యరాజా సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడుతూ... ఆయన ఒక ప్రతిభావంతుడైన చిత్రనిర్మాత, అద్భుతమైన స్క్రీన్ప్లే రచయిత, గొప్ప నటుడని చిరంజీవి ప్రశంసించారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. భాగ్యరాజా భార్య పూర్ణిమకి, వారి కుటుంబ సభ్యులందరికీ చిరంజీవి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కోలుకోలేని నష్టాన్ని భరించే శక్తిని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.


