అట్టహాసంగా ఆరంభమైన కాన్స్‌ చిత్రోత్సవాలు  | Cannes Film Festival started with a bang | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ఆరంభమైన కాన్స్‌ చిత్రోత్సవాలు 

May 18 2023 1:28 AM | Updated on May 18 2023 1:28 AM

Cannes Film Festival started with a bang - Sakshi

76వ కాన్స్‌ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్‌లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్‌కు చెందిన రూబెన్‌ ఓస్ట్‌లాండ్‌ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్‌ ఎల్‌. మురుగన్‌ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్‌ టీమ్‌ను లీడ్‌ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్‌ కార్పెట్‌పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. 

ఏడు నిమిషాల స్టాండింగ్‌ ఒవేషన్‌ 
తొలి రోజు బయోగ్రఫికల్‌ డ్రామా ‘జాన్‌ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్‌’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్‌ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్‌ రోల్‌ చేసిన జానీ డెప్‌ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు.

ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్‌ ఒవేషన్‌ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్‌ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. మైవెన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.  

కాన్స్‌లో భారతీయం 
ప్రతి ఏడాదీ కాన్స్‌ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు.  ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్‌ కార్పెట్‌పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్‌ కార్పెట్‌ పై సందడి చేశారు. దేశీ లుక్‌లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి.

వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్‌ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్‌ యాక్ట్రస్‌ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ప్రొడ్యూసర్‌ గునీత్‌ మోంగా, దర్శకుడు మధుర్‌ భండార్కర్, హీరోయిన్‌ అదితీరావ్‌ హైదరీ, నటుడు విజయ్‌వర్మ, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం.

అలాగే దర్శకుడు అనురాగ్‌ కశ్వప్‌ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్‌ దర్శకుడు అరిబామ్‌ శ్యామ్‌ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్‌ బసు ‘నెహెమిచ్‌’ వంటి భారత చిత్రాలు కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్‌ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు.  



రెండు దశాబ్దాలుగా... 
కాన్స్‌ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్‌ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు  రెండు దశాబ్దాలుగా కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ఐష్‌ మెరుస్తున్నారు. షారుక్‌ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్‌ ప్రధాన పాత్రల్లో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్‌’ (2002) చిత్రం 55వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్‌ క్రమం తప్పకుండా కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్‌ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement