హీరోయిన్ భూమిక చావ్లా చాలాకాలం తర్వాత యుఫోరియా మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, సారా అర్జున్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతోంది. ఈక్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో భూమిక భావోద్వేగానికి లోనైంది.
ఏడుపు ఆపుకోలేకపోయిన భూమిక
యుఫోరియాలాంటి సినిమాను తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నిన్ననే సినిమా మొత్తం చూశాను. రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి ఆ పాత్ర గురించే ఆలోచించా.. అంటూ ఏడ్చేసింది. దాంతో అక్కడే ఉన్న గుణశేఖర్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే దుఃఖంతో గొంతు కూరుకుపోవడంతో ఆమె ఇక మాట్లాడలేకపోయింది.
ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీశా..
తర్వాత గుణశేఖర్ మాట్లాడుతూ.. 1992లో వచ్చిన లాఠీ నా మొదటి సినిమా. యుఫోరియా నా పద్నాలుగో సినిమా. కొత్త కథ చెప్పాలని సాయశక్తులా ప్రయత్నించాను. ప్రేక్షక దేవుళ్ల సమయం, డబ్బు, విజ్ఞతకు విలువిస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశాను. మీ సమయం, డబ్బు.. ఏదీ వృథా చేయను.
తొలిసారి చూస్తున్నా..
మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ కథకు వెన్నెముక భూమిక. తను చాలా స్ట్రాంగ్ లేడీ. తనలా ఎమోషనల్ అవడం తొలిసారి చూస్తున్నాను. సినిమా చూసిన కొందరు భయపడ్డామన్నారు. యుఫోరియా అనే టైటిల్ ఎందుకు పెట్టామో రేపు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది అని చెప్పుకొచ్చాడు.


