మన శంకర వరప్రసాద్ గారు ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. 25రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 375 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు.

మొదటివారంలోనే మన శంకర వరప్రసాద్ గారు రూ.292 కోట్లు వసూలు చేసింది. కేవలం ఫస్ట్ వీక్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు 25 రోజుల్లో రూ. 375 కోట్లు రాబట్టి ఆల్టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగు భాషలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇప్పటి వరకు ఏదీ లేదు. ఇప్పటి వరకు రూ. 300 కోట్ల కలెక్షన్స్తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, గుంటూరు కారం, సర్కారు వారి పాట, మహార్షి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు వర్షన్లో మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే.
ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు రాబట్టింది. చిరు (Chiranjeevi) కెరీర్లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు నెలకొల్పింది. ఆపై బుక్మైషోలో ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ప్రతి అంశంలో మన శంకర వరప్రసాద్ రికార్డ్స్ క్రియేట్ చేశారు.


