సాంకేతిక పరిజ్ఞానం నానాటికి అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్భవించిన సాంకేతిక పరిజ్ఞానం ఏఐ (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్). ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకుంటోందని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ ఇప్పుడు సినీ రంగంలోనూ విజంభిస్తోంది. అలాంటి ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న తాజా చిత్రం అవిరా. దీనికి కథా, కథనం, సంభాషణలు ,దర్శకత్వం,ఏఐ సాంకేతిక బాధ్యతలను ప్రభాకరన్ నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సుమారు 70కి పైగా వాణిజ్య ప్రకటనలను రూపొందించారు.
ఆ అనుభవంతో పూర్తిగా ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీతో అవిరా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూర్తి స్థాయి ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. పురాణ కథలకు ఫాంటసీని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రంలోని పాత్రలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆబాలగోపాలాన్ని అలరించే కథా చిత్రంగా అవిరా ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.కాగా దీన్ని లైట్ హౌస్ ఫిలిం కంపెనీ పతాకంపై గణేష్, జగదీష్ కలిసి నిర్మిస్తున్నారు.


