అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ గురించి అందరికి తెలిసిందే. సినిమాను తెరకెక్కించడమే కాదు..ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్స్ చేస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంలో అనిల్ ప్రమోషన్స్ కూడా పాత్ర కూడా బాగానే ఉంది. స్టార్ హీరో వెంకటేశ్తో ఇన్స్టా రీల్స్ కూడా చేయించి.. సినిమాను అందరికి రీచ్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ‘మనశంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా అప్లై చేశాడు. సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టాడు. షూటింగ్ మొదలైన రోజే.. మెగాస్టార్ చిరంజీవిపై ఓ స్పెషల్ వీడియో వదిలాడు. ఒకపక్క షూటింగ్ చేస్తూనే..మరోపక్క ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. చివరకు నయనతారతో కూడా సినిమా ప్రమోషన్స్ చేయించిన ఘనత అనిల్కే దక్కింది.
సాధారణంగా నయనతార మూవీ ప్రమోషన్స్కి చాలా దూరంగా ఉంటారు.తనతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలతో ముందుగానే ప్రమోషన్స్కి రానని అగ్రిమెంట్ చేసుకుంటారు. దానికి ఒప్పుకుంటేనే సినిమాకు నయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎంత పెద్ద స్టార్ సినిమాలో నటించినా, దిగ్గజ దర్శకులు డైరెక్ట్ చేసినా ఆమె మాత్రం ప్రమోషన్స్కి వెళ్లరు.
అయితే మనశంకరవరప్రసాద్ గారు సినిమాకు వచ్చేసరికి ఆమె తీరే మారిపోయింది. చాలా హుషారుగా ప్రమోషన్స్ చేసున్నారు. ఆమెతో చేయించిన స్పెషల్ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అదే సమయంలో నయనతారపై కొంతమేర ట్రోలింగ్ కూడా నడిచింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఆమె తీరును తప్పుబట్టారు.
కోలీవుడ్లో ఎంత పెద్ద స్టార్ హీరోలతో నటించినా, చివరికి తను స్వయంగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ప్రమోషన్స్కు రాని నయనతార... తెలుగు సినిమాల కోసం ఇలా ముందుకు రావడం ఏంటీ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా మీకు అంత ఎక్కువైపోయిందా? అంటూ ఆమెపై విమర్శలు చేశారు.తాజాగా ఈ ట్రోలింగ్పై ‘మనశంకర్ వరప్రాసద్ గారు’ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్ని ఆమె పట్టించుకోదని.. తనకు నచ్చిన పని చేస్తుందని చెప్పారు.
‘ఒక్కో సినిమాకు ఒక్కో వైబ్ ఉంటుంది. ప్రతి మూవీకి దర్శకుడు వెళ్లి హీరో, హీరోయిన్లకు కథ చెబుతాడు. అయితే వాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నామనేది ముఖ్యం. మన ప్రవర్తనను బట్టి.. వాళ్లు కూడా మారుతుంటారు. నేను అందరితో కలిసిపోతుంటాను. ప్రతి ఆర్టిస్ట్ని కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటాను. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా వచ్చి నా భుజంపై చేయి వేసి మాట్లాడతారు. అంతలా వాళ్లతో కలిసిపోతాను. మనం జన్యూన్గా అడిగినప్పుడు.. మనకున్న బాండ్ని బట్టి చేయను అనే వాళ్లు కూడా ప్రమోషన్స్ చేస్తారు. నయనతార చాలా నిజాయితీగా పని చేస్తారు. తను నటించే సినిమాలకు 100 శాతం న్యాయం చేస్తారు. ‘సినిమాకు ఇది అవసరం..దర్శకుడు పని తీరు ఇలా ఉంటుంది’ అని అమె బలంగా నమ్మినప్పుడు కచ్చితంగా ప్రమోషన్స్ చేస్తారు’ అని అనిల్ చెప్పుకొచ్చారు.
‘మన శంకరవరప్రసాద్ గారు’ విషయానికొస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
A Sweet New year Surprise to all of you from team #ManaShankaraVaraPrasadGaru
GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12th pic.twitter.com/gT1uHFTwmX— Nayanthara✨ (@NayantharaU) January 1, 2026


