వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోకు ఒక్క హిట్ పడితే చాలు.. మళ్లీ పుంజుకోవడానికి అదే విజయమే ఊతమవుతుంది. ఇప్పుడు రవితేజ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ‘ఇరుముడి’తో హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత రూ.100 కోట్ల వసూళ్లను అందుకున్నాడు. ‘ధమాకా’(2022) తర్వాత ఆయన నటించిన ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కొన్ని సినిమాలైతే కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి. దీంతో రవితేజ సినిమా వస్తుందంటే గతంలో కనిపించినంత హడావుడి కూడా కనిపించేది కాదు. కానీ ‘ఇరుముడి’ మాత్రం ఆ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. రవితేజలో మళ్లీ జోష్ నింపడమే కాకుండా.. ఆయన మార్కెట్పై కూడా కొత్త నమ్మకాన్ని తీసుకొచ్చింది. దీంతో వచ్చిన విజయాన్ని ఎలాగైనా కొనసాగించాలని భావిస్తున్న రవితేజ.. తన లైనప్పై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
‘ఇరుముడి’ ఇచ్చిన ఊపు
‘ఇరుముడి’ ఇంతటి బ్లాక్బస్టర్ కావడం అభిమానులకు మాత్రమే కాదు.. రవితేజకు కూడా ఎక్కడ లేని హుషారు తెచ్చిందట. హిట్ అయితే చాలనుకున్న సినిమాకు ఏకంగా రికార్డు స్థాయి వసూళ్లు(8 రోజుల్లో రూ. 150 కోట్ల గ్రాస్) రావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. రెండో వారంలో ‘టాక్సిక్’ కారణంగా స్క్రీన్లు తగ్గినా.. ఆ సినిమా టాక్ ప్రభావంతో ‘ఇరుముడి’కి మళ్లీ షోలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలాంటి భారీ విజయం తర్వాత హీరోలు మరింత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఒక్కసారి వచ్చిన సక్సెస్ను కొనసాగించాలంటే తర్వాతి సినిమాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇప్పుడు రవితేజ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు టాక్.
రవితేజ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు
ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీవిష్ణుతో కలిసి దిల్ రాజు నిర్మాణంలో హసిత్ గోలి తెరకెక్కించనున్న ఎంటర్టైనర్. ఈ సినిమాకు ‘దాగుడుమూతల దండాకోర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత లక్ష్మణ్ నిర్మించనున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రానికి కొంత హారర్ టచ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే వరుస ప్రకారం చూస్తే ముందుగా హసిత్ గోలి సినిమా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. అయితే ‘ఇరుముడి’ తర్వాత రవితేజకు వచ్చిన సక్సెస్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు లెక్కలు మారుతున్నట్లు సమాచారం. ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
అయితే రెండు సినిమాలను సమాంతరంగా చేయడం కూడా ఒక ఆప్షన్గానే ఉన్నప్పటికీ.. రవితేజ లుక్లో మార్పులు చేయాల్సి రావడంతో అది అంత సులభం కాదని తెలుస్తోంది. మరోవైపు హసిత్ గోలి తెరకెక్కించనున్న ఎంటర్టైనర్లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి ఉందని సమాచారం. స్క్రిప్ట్పై మరింత వర్క్ చేయడానికి సమయం అవసరం కావడంతో ఆ సినిమాను కొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న చర్చలు నిజమైతే.. సెప్టెంబర్ మూడో వారం లేదా అక్టోబర్లో వివేక్ ఆత్రేయ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో హసిత్ గోలి సినిమా మొదలైతే సంక్రాంతి విడుదలను టార్గెట్గా పెట్టుకుని షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చలే తప్ప అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఏదేమైనా ‘ఇరుముడి’ విజయం రవితేజ ఆలోచనా విధానంలో మాత్రం గణనీయమైన మార్పు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది.


