సన్నీ డియోల్ హీరోగా నటించిన బోర్డర్ 2 చిత్రం ఈ నెల 23న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం డియోల్ ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డర్ 2పై అప్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్(Rashid Khan) ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. దుబాయ్లో హైవే పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న వీడియో ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘బోర్డర్ 2 సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా.ఇప్పుడు నేను ఈ రీల్ పోస్ట్ చేస్తున్నా కదా.. చూద్దాం ఏమవుతుందో చూద్దాం’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో బోర్డర్ 2లోని పాట ప్లే చేయడం గమనార్హం. రషీద్ పోస్ట్పై బాలీవుడ్ ప్రముఖులు సరదాగా స్పందించారు. ‘హా భాయ్’ అని వరుణ్ ధావన్ కామెంట్ పెట్టగా.. ‘అదే మార్గం’( ఆ హైవే నుంచే సినిమాకు రావాలి అనే అర్థం వచ్చేలా..) సునీల్ శెట్టి కామెంట్ చేశాడు.
బోర్డర్ 2 విషయానికొస్తే.. 1997లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'బోర్డర్'కి సీక్వెల్ ఇది. జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. సన్నీ డియోల్ తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి ప్రముఖులు నటించారు. మన దేశంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సోమవారం ప్రారంభం అయ్యింది. విదేశాల్లో ఆదివారం సాయంత్రం ప్రారంభం అయ్యింది. అయితే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ సినిమా కథ ఉందంటూ.. కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి గల్ఫ్ దేశాలు బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


