32 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌తో రజనీకాంత్ సినిమా | Actress Shobana 32 years After A movie With Rajinikanth | Sakshi
Sakshi News home page

32 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌తో రజనీకాంత్ సినిమా

Apr 9 2024 12:22 PM | Updated on Apr 9 2024 2:49 PM

Actress Shobana 32 years After A movie With Rajinikanth - Sakshi

దళపతి చిత్రం కాంబో రిపీట్ కానుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ము ట్టి, అరవిందస్వామి కలిసి నటించిన చిత్రం దళపతి. ఇందులో శోభన కథానాయకిగా నటించారు. 1988లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ విషయం పక్కన పెడితే నటుడు రజనీకాంత్ ప్రస్తుతం వేటైయాన్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.

బాలీవుడ్ బిగ్ బీ అమితా బచ్చన్, యువ నటి దుషార విజయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది. దీనికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా దీనికి 'కళుగు' అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ చిత్రం టైటిల్, టీజర్‌ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు లోకేష్ ఇంతకుముందు చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో రజనీకాంత్ సరసన సీనియర్ నటి, నృత్య కళాకారిణి శోభన నటించనున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. వీరిద్దరు కలిసి నటించిన దళపతి చిత్రం 1988లో విడుదలైన విషయం గమనార్హం. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంతా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement