
సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా అది వార్త అవుతుంది. అందుకే వాళ్లు ఆచి తూచి మాట్లాడుతుంటారు. అయితే కొన్ని సార్లు వాళ్లు జోక్ చేసినా..అది బెడిసి కొడుతుంది. వారి సరదా సంభాషణను వక్రీకరించి.. అదే నిజం అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ విషయంలో అదే జరిగింది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సరదాగా చెప్పిన ఓ విషయాన్ని.. సోషల్ మీడియా మరోలా ప్రచారం చేసింది. చివరకు ఆ వీడియో షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ(Brahmaji).. వివరణ ఇవ్వడంతో ఫేక్ ప్రచారానికి కాస్త బ్రేక్ పడింది. ఇంతకీ మంచు ఫ్యామిలీ చేసిన ఆ సరదా వీడియో ఏంటి? అసలు ఏం జరిగింది?
700 ఎకరాలు మనదే..: మోహన్బాబు
మంచు ఫ్యామిలీ ఇప్పుడు కన్నప్ప(Kannappa) ప్రమోషన్లో బిజీ అయిపోయింది. మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రమోషన్స్లో భాగంగా న్యూజిలాండ్లో కన్నప్ప టీం చిల్ అయిన వీడియోని నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో మోహన్ బాబు, విష్ణు సముద్రం పక్కన ఉన్న ఓ సువిశాలమైన మైదానంలో తిరుగుతూ.. ‘ఇదంతా నాదే.. న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు కొన్నాం. పక్కనే ఉన్న సముద్రం కూడా మంచు విష్ణుదే’ అని మోహన్ బాబు సరదాగా అంటాడు. మోహన్ బాబు కామెడీగా చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. నిజంగానే మంచు ఫ్యామిలీ న్యూజిలాండ్లో స్థలాలు కొన్నారు అన్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో చివరకు వీడియో షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ దీనిపై వివరణ ఇచ్చాడు.
అరే భాయ్.. అంత ఈజీనా?
సరదాగా చేసిన వీడియోపై నెగెటివ్గా వార్తలు రావడంతో బ్రహ్మాజీ సంబంధించాడు. జోక్గా చేసిన వ్యాఖ్యలను కూడా ఇంత సీరియస్గా తీసుకుంటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫన్ కోసమే ఆ వీడియోని షేర్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. ‘ సరదా కోసమే ఆ వీడియో చేశాం. న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు కొన్నామని మోహన్ బాబు సరదాగా అన్నారు. అక్కడి పర్వతాలు కూడా కొన్నామని జోక్ చేశాడు. కానీ సడెన్గా నిజంగానే అక్కడ 7 వేల ఎకరాలు కొన్నారని వార్తలు రాశారు. అరే భాయ్.. న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు కొనడం అంత ఈజీనా? షూటింగ్ కోసం అక్కడి వెళ్లాం అంతే. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. . నాన్ సిటీజెన్స్లకు న్యూజిలాండ్లో స్థలాలు అమ్మరు. అక్కడి సిటిజన్స్కి మాత్రమే స్థలాలు కొనే హక్కు ఉంది. సరదా సంభాషణలను సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు నవ్వుకోండి. కానీ కామెడీని మరోలా మార్చి చెప్పకండి’ అని బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు.