డ్యాన్స్ రియాలిటీ షోలలో ఒక ప్రభంజనం ఆట. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన ‘ఆట’మరోసారి వచ్చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి ఎందరో ప్రతిభావంతులైన డ్యాన్సర్లను వెలుగులోకి తీసుకురాబోతోంది. బుల్లితెర పాపులర్ డ్యాన్స్ షో ‘ఆట’ సరికొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతోంది. జీ తెలుగులో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. టీవీలో కంటే రెండు రోజుల ముందుగా ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఎపిసోడ్స్ రిలీజ్ కానున్నాయి.
16 మంది మధ్య పోటీ
ఈసారి ఆట షోకి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటార్స్ కావ్య, విష్ణుప్రియ, వంశీ, సమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్కుమార్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మెగా డాటర్ నిహారిక కొణిదెల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆట షో ప్రారంభ ఎపిసోడ్లో అద్భుతమైన ప్రదర్శనలతో కంటెస్టెంట్స్ పోటీపడేందుకు సిద్ధమయ్యారు.
హిట్ సాంగ్స్తో మొదలు
ఇటీవల బ్లాక్బస్టర్ హిట్ సాంగ్స్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి..’, ‘చుట్టమల్లే..’, ‘గిర గిర గిర గింగిరానివే..’ వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కంటెస్టెంట్లు, మెంటర్లు డ్యాన్స్ చేసి అలరించనున్నారు. అంతేకాదు, యాంకర్ సుధీర్ ప్రస్థానంపై కంటెస్టెంట్ అక్షత ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న రాప్టర్ యువరాజ్ కంటెస్టెంట్గా ఆట టైటిల్ పోరులో దిగనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు, భావోద్వేగ క్షణాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ షోను ఈ వీకెండ్ నుంచి చూసేయండి..


