రూ. 20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఐఈఓ గోవిందరాం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఏసీబీ వలకు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవిందరాం చిక్కారు. ఓ ప్రైవేట్ కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు సదరు యాజమాన్యం నుంచి రూ. 20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. జిల్లా విద్యాధికారి గోవిందరాం గత కొన్ని రోజుల క్రితం పట్టణంలోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో కళాశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు చిన్ని చిన్న లోటుపాట్లను గుర్తించారు. దీంతో కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర విద్యాశాఖకు కళాశాలపై నెగిటివ్ రిపోర్టు ఇస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో కళాశాల నిర్వాహకులు ఒప్పందం ప్రకారం ముందుగా రూ. 30 వేలు ఇచ్చారు. మిగితా రూ. 20 వేల కోసం రోజు ఫోన్ చేసి ఇబ్బందులు పెట్టారు. దీంతో వారు ఈనెల 7న ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం కలెక్టరేట్లోని ఇంటర్మీడియెట్ కార్యాలయంలో కళాశాల యాజమాన్యం నుంచి రూ. 20 వేలు తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, జిల్లా గోవిందరాంపై విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. బీరంగూడతో పాటు సంగారెడ్డి పట్టణంలోని రెండు కళాశాలలు అనుమతి లేకున్నా, కొనసాగుతున్నాయని విద్యార్థి సంఘాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


