నర్సాపూర్ రూరల్: మండలంలోని చిన్న చింతకుంటలో ప్రకృతి వ్యవసాయ సాగు కోసం ఎంపికై న 40 మంది రైతులకు బుధవారం తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతి (సేంద్రియ) ఎరువులతో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం కోల్పోవడంతో పాటు పంటలు దిగుబడి పూర్తిగా తగ్గుతుందన్నారు. దీంతో పాటు రసాయన ఎరువులతో పండించిన ధాన్యం, పప్పు దినుసులు ఇతర ఆహార పదార్థాలతో అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. మనుషుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకొని పంటలు సాగు చేయాలని వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికై న రైతులకు వేప నూనె, హ్యూమిక్ ఆమ్లం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత, రైతులు మహేశ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.


