స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సుభాష్
రేగోడ్(మెదక్): ప్రజల్లో ఫిజియోథెరపీ.. వ్యాయామం ప్రాముఖ్యతపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పి.సుభాష్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ..క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించవచ్చన్నారు. గుండె వ్యాధులు, పక్షవాతం, క్రీడా గాయాలు, సర్జరీకి ముందు–తర్వాత రిహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ కీలకమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫిజియోథెరపీ సేవలపై అవగాహన మరింత పెరగాలని ఆయన సూచించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్
నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత పాలనను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల నాయకులను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం విపక్షాల గొంతునొక్కడమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ ఆరోపించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికల హామిల అమలులో సీఎం విఫలం చెందాడని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సోమవారం ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ఆయన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హామీలు అమలు చేయాలన్న డిమాండుతో ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ప్రతిపక్షాల హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సురేశ్ మాట్లాడుతూ..సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్కు చెందిన మహిళ ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారించిన తీరు సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మహిళలకు, మహిళ ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు రమేశ్గౌడ్, ఆంజనేయులుగౌడ్, నగేశ్, రాములునాయక్ తదితరులున్నారు.
తొగుట(దుబ్బాక): ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు సూచించారు. మిరుదొడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పర్పంచ్లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


