ఎంపీ రఘునందన్రావు
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించినట్లు మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ను కలిసి రైల్వే సమస్యలపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెల్లాపూర్ – విద్యుత్నగర్ మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వెడల్పు కోసం రూ.21 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. దీనిపై శనివారం సాయిబాబా ఆలయం వద్ద రైల్వే, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెల్లాపూర్ రైల్వే స్టేషన్ను రేడియల్ రోడ్డుకు అనుసంధానించేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మంజూరైందని చెప్పారు. ఇందులో భాగంగానే త్వరలో ఆ పనులకు భూమిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, నాయకులు సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


