చిలప్చెడ్(నర్సాపూర్): ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, బీట్ వ్యవస్థను బలోపేతం చేసి, నేరాల అదుపునకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ డివీ. శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన చిలప్చెడ్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలిచ్చారు. అనంతరం చిట్కుల్లోని కేజీవీబీ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చిలప్చెడ్ శివారులో వెయ్యి గజాల స్థలం కేటాయిస్తే, పోలీస్ స్టేషన్ నిర్మించే విధంగా చర్య తీసుకుంటానన్నారు. చాముండేశ్వరి ఆలయంలో చోరీచేసిన దొంగలను, క్లూస్ టీం ఆధారంగా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలని, డ్రగ్స్ తీసుకుంటూ ఎవరైనా కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. అనుమానస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురికాకుండా 112 నంబర్కు డయల్ చేయాలన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐలు నంగా కృష్ణ, సందీప్రెడ్డి, స్థానిక ఎస్ఐ నర్సింహులు, ఎంఈఓ విఠల్, కేజీబీవీ ఎస్ఓ అంజలి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


