మెదక్జోన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ 52 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, ప్రధానోపాధ్యాయులు, పీజీ హెచ్ఎంలు ఉన్నారు. వీరందరికీ శనివారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
మెదక్ కలెక్టర్: ఈనెల 6న హైదరాబాద్లో నిర్వహించనున్న ‘ఉద్యోగుల సంకల్ప సభ’ను విజయవంతం చేయాలని జిల్లా జేఏసీ నాయకులు జిడ్డి ఎల్లం, జంగం నగేశ్ పిలుపు నిచ్చారు. శుక్రవారం పట్టణంలో సంకల్ప సభ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయా లన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటినే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ సెక్రటరీల సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింలు, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సంతోష్ కుమార్, ప్రభాకర్, భిక్షపతి, ఆంజనేయులు, శ్రీశైలం, స్వామి, చంద్రశేఖర్, రాజు, మల్లేశ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి శుక్రవారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు శంకరశర్మ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు, అర్చన చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆమె వెంట మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, నాయకులు జీవన్రావు, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కో కన్వీనర్ కృష్ణాగౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: పట్టణంలోని 15వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్ శుక్రవారం విస్తృతంగా పర్యటించి తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ పరిశీలించారు. అనంతరం వార్డుల్లో విద్యుత్ స్తంభాలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే రోహిత్రావు సహకారంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
రామచంద్రాపురం(పటాన్చెరు): 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా చెందిన 104 ఉద్యోగ సంఘం నాయకులు రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ..గత 18ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న 300మందిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. డీఎంఈ పరిధిలోని ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరిని నిబంధనల ప్రకారం జిల్లా డీఎస్సీ ద్వారా ఎంపీక చేసినప్పటికీ వారికీ నేటికీ ఔట్సోర్సింగ్ విధానంలోనే వేతనాలివ్వడం బాధాకరమన్నారు.


