అత్యాశే సైబర్‌ నేరగాళ్లకు ఆయుధాలు | - | Sakshi
Sakshi News home page

అత్యాశే సైబర్‌ నేరగాళ్లకు ఆయుధాలు

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

అత్యాశే సైబర్‌ నేరగాళ్లకు ఆయుధాలు రోగులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు సీపీఎస్‌ను రద్దు చేయండి

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

మెదక్‌జోన్‌: అత్యాశ, భయం, తొందరపాటు చర్యలే సైబర్‌ నేరగాళ్లకు ఆయుధాలుగా మారుతున్నాయని అప్రమత్తతతోనే నేరాలకు చెక్‌పెట్టవచ్చిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే ప్రపంచమే అరచేతిలోకి వచ్చినట్టేనని బ్యాంకింగ్‌ నుంచి షాపింగ్‌ వరకు..నగదు బదిలీల నుంచి ప్రభుత్వ సేవల వరకు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయని ఈ సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. ఉద్యోగంలోన,లాటరీ, బహుమతుల పేరుతో ఆశ చూపించడం వంటి కొత్తకొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌, ఓటీపీ, యూపీఐపిన్‌, పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్‌ మోసానికి గురైన తర్వాత భయంతో మౌనంగా ఉండొద్దని వెంటనే 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజల అప్రమత్తతే సైబర్‌ నేరగాళ్లకు అసలైన అడ్డుకట్ట అని ఎస్పీ సూచించారు.

జిల్లా వైద్యాధికారి గణేశ్వర్‌

నర్సాపూర్‌ రూరల్‌: రోగులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ గణేశ్వర్‌ వైద్య సిబ్బందికి స్పష్టం చేశారు. నర్సాపూర్‌ మండలంలోని రెడ్డిపల్లి పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌తోపాటు ఓపీ రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ గది, ఐఎల్‌ఆర్‌ వ్యాక్సిన్లను తనిఖీ చేశారు. అనంతరం పీహెచ్‌సీ సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. నెలవారీ ఆశ మీటింగ్‌లో సిబ్బంది పాల్గొని మాతా శిశు సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం, ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌ రికార్డులు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్‌ రఘువరన్‌, డెమో అన్వర్‌, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అనుమతుల్లేని ప్రైవేట్‌ ఆస్పత్రి సీజ్‌

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నర్సాపూర్‌లో నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని మంగళవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ గణేశ్వర్‌ తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్‌లోని న్యూ అమ్మ హాస్పిటల్‌ నిర్వహించడానికి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం దరఖాస్తుతోపాటు ఎలాంటి డాక్యుమెంట్లు, అవసరమైన సర్టిఫికెట్లు తమ కార్యాలయంలో ఇవ్వలేదని చెప్పారు. ఎలాంటి అనుమతులు పొందకుండా ఆస్పత్రిని నెల రోజులుగా నడిపిస్తున్నందున తనిఖీ చేసి సీజ్‌ చేయడంతోపాటు ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చామని తెలిపారు. డీఎంహెచ్‌ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సృజన, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ జయశ్రీ,, డెమో ఇన్‌చార్జి డాక్టర్‌ అన్వర్‌ తదితరులున్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడమే ఉద్యోగుల జేఏసీ పంతమని జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌్‌ దొంత నరేందర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దొంత నరేందర్‌ మాట్లాడుతూ...సెప్టెంబరు 1వ తేదీని ఇప్పటికే పెన్షన్‌ విద్రోహ దినంగా ప్రకటించామన్నారు. 2004 సెప్టెంబరు 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన ఉద్యోగులంతా నూతన పెన్షన్‌ విధానంతో అభద్రతా భావానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ కింద పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం, అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబాలు పెన్షన్‌ లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులు సీపీఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలెక్టరేట్‌ ప్రాంతం మార్మోగింది. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌ ఏవో యూనిస్‌కు అందజేశారు. కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement