● జిల్లాలో పలుచోట్ల రైతుల
ఆందోళనలు
● నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులు
రామాయంపేట(మెదక్): స్థానిక సహకార సంఘానికి మంగళవారం వచ్చిన రెండు వేల బస్తాల యూరియా కేవలం నిమిషం వ్యవధిలోనే అమ్ముడుపోయింది. దీంతో యూరియా లభించని ఇతర రైతులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెలితే...రామాయంపేట సహాకార సంఘానికి ఐదు లారీల్లో రెండు వేల బస్తాల యూరియా స్టాక్ వచ్చింది. సమాచారం అందుకొని వందల సంఖ్యలో రైతులు సొసైటీ వద్దకు తరలివచ్చారు. ఈ మేరకు వారు సెల్ఫోన్లోని యాప్లో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా, అప్పటికే స్టాక్ నిల్ చూపించింది. అవాకై ్కన రైతులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కారు. వ్యాపారులు ముందే యాప్లో యూరియా బుక్ చేసుకుని నల్లబజారుకు తరలిస్తున్నారని వారికి అధికారులు సహకరిస్తున్నారని రైతులు ఆరోపించారు. వ్యవసాయ కార్యాలయం ఎదురుగా మెదక్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నిమిషాల వ్యవఽధిలోనే రెండు వేల బస్తాలు ఎలా అయిపోతాయని వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు, మండల వ్యవసాయ అధికారి వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కేవలం నిమిషం వ్యవధిలోనే యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారని, దీంతో యాప్లో నిల్ స్టాక్ చూపిస్తుందని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో అదనంగా స్టాక్ తెప్పించి రైతులకు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
యాప్ రద్దు చేయాల్సిందే
చేగుంట(తూప్రాన్): యూరియా యాప్తో గ్రామాల్లోని రైతులకు యూరియా దొరకడం లేదని చేగుంట గాంధీ చౌరస్తా వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..గ్రామాల్లో ఎక్కువమంది రైతులు చిన్న ఫోన్లు వాడుతున్నారని వారికి యాప్లో యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. స్మార్ట్ఫోన్లున్న రైతులకు సైతం యూరియా బుకింగ్ చేసుకునేలోపే క్షణాల్లోనే బుకింగ్ పూర్తవుతుందని పేర్కొన్నారు. రాస్తారోకోతో ట్రాఫిక్ ఇబ్బందిని గుర్తించిన ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి ఉన్నతాధికారులకు సమస్యను తెలియజేస్తామని సర్దిచెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
గోదాంకు తాళం
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో యూరియా గోదాంకు మంగళవారం తాళం వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. నెట్ వర్క్ సమస్యతో తమకు బుక్ కావడంలేదని నేరుగా తమకు యూరియా అందించాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో తాము యూరియా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన సాధ్యం కావడంలేదన్నారు. అదే ఇతర గ్రామాల రైతులకు ఆన్లైన్లో యూరియా బుక్ అవుతుందన్నారు. యూరియా దొరకపోవడంతో తమ పంటలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్లు జంగరాయి గ్రామానికి చేరుకుని రైతులను సముదాయించి యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గడ్డం నెల్లూర్ తదితర రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. తమకు నేరుగా యూరియా అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.


