టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్
మెదక్ కలెక్టరేట్: ఉద్యోగ సమయంలో చేసిన సేవలే చిరస్థాయిగా గుర్తింపునిస్తాయని, ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ వెంకటయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమం పట్టణంలోని ఓ గార్డెన్లో నిర్వహించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి జోజి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్, ఉద్యానవనశాఖ అధికారి ప్రతాప్సింగ్తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు హాజరై వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి ఉద్యోగ సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అవి జీవితకాలం గుర్తుండేలా చేస్తాయన్నారు. అనంతరం యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గండి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో వెంకటయ్యను సన్మానించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు, సిబ్బందితో పాటు యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


