రైతన్నకు అకాల మరణం సంభవిస్తే అతనిపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడకూడదని ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి ప్రభుత్వం మంగళంపాడింది. దీంతో రైతు సంఘాల నేతలు ఆవేదన చెందుతున్నారు.
– మెదక్జోన్
జిల్లాలో 21 మండలాలు ఉండగా సుమారు 4 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు భూములున్నాయి. అధికారుల రికార్డుల ప్రకారం 3,00,558 మంది రైతులున్నారు. రైతు కుటుంబాల కోసం 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏదేని కారణంతో రైతులు మరణిస్తే బాధిత కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షల బీమాను ఇచ్చేది. దీంతో ఆ కుటుంబానికి కొంత ఆర్థికంగా వెసులుబాటు దక్కేది. ఈ పథకం ప్రవేశపెట్టిన దగ్గర్నుంచీ ప్రతి ఏటా ఆగస్టు 14న రైతులకు సంబంధించిన ఇన్స్యూరెన్స్ ప్రీమియాన్ని సదరు బీమా కంపెనీలకు ప్రభుత్వమే చెల్లించేది. క్రమం తప్పకుండా రెన్యూవల్ చేసేవారు. కాగా ఈసారి మాత్రం రెన్యూవల్ గడువు ముగిసి 15 రోజులవుతున్నా బీమా ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. దీంతో ఇక పథకానికి మంగళం పాడినట్టేనా..? అంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కుటుంబీకులందరిపై పట్టా
అప్పటి ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టాక చనిపోయిన బాధిత రైతుకుంటుంబానికి బీమా కంపెనీ నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం డబ్బులు అందాయి. రైతు కుటుంబాలను ఆదుకునే ఈ పథకం అందరికి వర్తించాలనే ఉద్దేశ్యంతో ఒక్క కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే ఆ నలుగురిపై ఉన్న భూమిని తలా ఇంత పట్టా చేసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు పథకాల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది రైతుబీమా పథకమనే చెప్పాలి.
41 మంది మృత్యువాత
ఈ నెల 13తో రైతు బీమా గడువు ముగిశాక 15 రోజుల వ్యవధిలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 41 మంది రైతులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబాలకు ఇన్య్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది.
13 వరకే పనిచేసిన ఇన్స్యూరెన్స్
14 నుంచి నమోదుకాని ‘డెత్’వివరాలు
15 రోజుల్లో జిల్లాలో 41 మంది మృత్యువాత
ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు


