రామాయంపేట(మెదక్)/వెల్దుర్తి(తూప్రాన్): సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆన్లైన్లో బుకింగ్ ప్రారంభమైన నిమిషం వ్యవధిలోనే ‘నో స్టాక్’ అని చూపిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కనిపించకపోవడంతో గురువారం మాసాయిపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పక్క మండలాలకు చెందిన రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ధర్నాతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే రామాయంపేట మండలం కోనాపూర్కు 350 బస్తాల యూరియా రాగా, వందలాది మంది రైతులు తరలివచ్చారు. ఇతర గ్రామస్తులకే యూరియా బస్తాలు ఇచ్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రామాయంపేట– సిద్దిపేట రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సహకార సంఘం గోదాంకు తాళం వేశారు. ఎస్సై బాలరాజ్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ రైతులను సముదాయించారు.
కోనాపూర్ వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు


