మెదక్ కలెక్టరేట్: చట్టబద్ధమైన దత్తతే సురక్షితమైన మార్గమని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం హైదరాబాద్కు చెందిన దంపతులు బాలసదన్ నుంచి 11 ఏళ్ల బాలికను కలెక్టర్ సమక్షంలో చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల సంక్షేమానికి సంబంధించిన నిబంధనలను పాటిస్తూ, అధికారిక ప్రక్రియ ద్వారా దత్తత తీసుకోవడం ద్వారా బాలలకు సురక్షితమైన, ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణాన్ని కల్పించవచ్చని తెలిపారు. దత్తత తీసుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను, సంబంధిత అధికారుల మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. బాలిక బాగోగులను ప్రతి 6 నెలలకు ఒక సారి పరిశీలించాలన్నారు. అంతకుముందు ప్రజలకు కలెక్టర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమాభార్గవి, డీసీపీఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


