● ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో నేటి నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహించే సభలను జిల్లాలోని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని తెలిపారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో..? లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని తెలిపారు. అర్హులైన పౌరులు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదుకు ఫారం–6, పేరు తొలగింపు, ఇతర అభ్యంతరాల కోసం ఫారం–7, వివరాల సవరణ కోసం ఫారం–8ను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం చేయూత పెన్షన్లపై కలెక్టర్ మాట్లాడారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి అవకాశమని తెలిపారు. అలాగే తెలంగాణ ఒపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా జరుగుతున్న టెన్త్, ఇంటర్ ప్రవేశాల పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళిమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


