అతివ.. ఉపాధి తోవ | - | Sakshi
Sakshi News home page

అతివ.. ఉపాధి తోవ

Aug 23 2026 7:50 AM | Updated on Aug 23 2026 7:50 AM

● పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 1,000 కుట్టు మిషన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ● జిల్లావ్యాప్తంగా 2 నియోజకవర్గాలు ఉండగా, రెండు వేల మిషన్లు అందించనున్నారు. ● రూ.12 వేల విలువ గల కుట్టమిషన్‌ను 100 శాతం సబ్సిడీతో పంపిణీ చేయనున్నారు. ● భవిష్యత్తులో పథకాన్ని విస్తరించి ప్రతి ఒక్కరికి అందించే విధంగా రూపకల్పన చేస్తున్నారు. ● 18– 55 లోపు వయసు కలిగి ఉండి, తప్పనిసరిగా బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళలై ఉండాలి. ● కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల లోపు ఉండాలి. ● ఒక రేషన్‌ కార్డుపై ఒక్కరు మాత్రమే అర్హులు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథలు, నిరుద్యోగ మహిళలకు ప్రాధాన్యం.

100% సబ్సిడీతో ప్రభుత్వం అందజేత వచ్చే నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ

రామాయంపేట(మెదక్‌): నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టైలరింగ్‌లో నైపుణ్యం కలిగిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇంటింటా ఇందిరమ్మ పథకం పేరుతో ఉచితంగా ఆటోమేటిక్‌ కుట్టుమిషన్లు అందించాలని నిర్ణయించింది. మహిళలకు టైలరింగ్‌ రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించి పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు అవకాశాలు కల్పిస్తోంది.

నియోజకవర్గానికి వెయ్యి

బీసీ మహిళలకు ‘ఇందిరమ్మ కుట్టు మిషన్లు’

దరఖాస్తు ఇలా..

జిల్లాలో అర్హులైన బీసీ మహిళలు http//: tgobmms@cgg.gov.in పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన నిరుద్యోగ మహిళలకే అందించే విధంగా కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 2023– 24లో బీసీ స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ధిపొందిన వారిని అనర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే ప్రభుత్వ నిబంధనలు మేరకు కనీస విద్యార్హత ఐదవ తరగతిగా నిర్ణయించారు.

నిబంధనల మేరకే పంపిణీ

అర్హులైన నిరుద్యోగ బీసీ మహిళలు సెప్టెంబర్‌ 15వ వరకు కుట్టు మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలు మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో అందించాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

– ఉపేందర్‌,

జిల్లా బీసీ సంక్షేమ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement