టేక్మాల్(మెదక్): ప్రభుత్వ ఆదేశాల మేరకు టేక్మాల్ మండల పరిషత్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. టేక్మాల్ గ్రామానికి చెందిన వ్యక్తి తను మరుగుదొడ్డి నిర్మించుకున్న బిల్లురాలేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇందులో తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ సత్యనారాయణ, ఏఓ రాంప్రసాద్, ఎంపీఓ రియాజొద్దిన్, ఎంఈఓ సుజాత, ఎపీఎం గోపాల్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 42,936 ఓట్ల గల్లంతు!
● విడుదలైన డ్రాఫ్ట్ నోటిఫికేషన్
● వచ్చేనెల 16వరకు అభ్యంతరాల స్వీకరణ
● అక్టోబర్ 19న, ఫైనల్ పబ్లికేషన్
మెదక్జోన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా 42,936 ఓట్లు తొలగిపోగా, ఇందుకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణతో పాటు కొత్తగా ఓటు నమోదు చేసుకునే అభ్యర్థులనుంచి వచ్చేనెల 16వతేదీ వరకు ఫిర్యాదులను స్వీకరించనునట్లు అధికారులు పేర్కొంటూ ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ను సోమవారం విడుదల చేశారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా వాటి పరిధిలో మొత్తం 4,53,140 మంది ఓటర్లు ఉండగా ప్రతీ ఒక్కరికి బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. కాగా, వారిలో 4,10,204 మంది మాత్రమే తిరిగి ఫారాలను ఇవ్వగా ఇంకా 42,936 మంది ఇవ్వలేదు. ఇందులో మెదక్ నియోజకవర్గంలో 2,20,427 మందికిగానూ 2,01,705 మంది ఇచ్చారు. మిగతా 18,722 మంది ఇవ్వలేదు. అలాగే నర్సాపూర్లో 2,32,713 మంది ఓటర్లకు గానూ 2,08,499 మంది ఇవ్వగా 24,214 మంది తిరిగి ఫాములను ఇవ్వలేదు.
వచ్చేనెల 16వరకు అభ్యంతరాలు
ఎస్ఐఆర్లో వచ్చే నెల 16వ తేదీ వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణతోపాటు కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ అభ్యంతరాలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అక్టోబర్ 19న తుది జాబితాను ప్రచురించనున్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి
చిలప్చెడ్(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదిముబాకర్ పథకాన్ని నిలిపివేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి రేవంత్ సర్కారు తీరును విమర్శించారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె చిలప్చెడ్ తహసీల్ ఆవరణలో కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఆడ పిల్లలను కన్న పేద తల్లిదండ్రుల బాధను చూడలేక, ప్రతీ ఆడపిల్ల చదుకోవాలని, 18 ఏళ్ల వయసు నిండేవరకు పెళ్లి చేసుకోకూడదనే మంచి సంకల్పంతో, కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కల్యాణలక్ష్మిని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్తగా పెళ్లైన ఆడపిల్లల తల్లిదండ్రులకు రూ. లక్షతోపాటు, తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తులం బంగారం ఇవ్వకపోగా, ఇవ్వాల్సిన కల్యాణలక్ష్మిని సైతం నిలిపివేసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఆ పథకాలను తిరిగి అమలు చేయాలని తహసీల్దార్ శివప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి, ఉద్యమ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి, సర్పంచ్లు అనిల్, బలవంత్రెడ్డి, కున్యానాయక్, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి పాల్గొన్నారు.


