పుట్టల వద్ద పోటెత్తిన భక్తులు
మెదక్ కలెక్టరేట్: నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు నాగులపుట్ట, ఆలయాల వద్ద పోటెత్తారు. ఈ సందర్భంగా నాగుల పుట్టల్లో పాలుపోసి పుట్టలకు పసుపు, కుంకుమలు, పూలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే మెదక్ పట్టణంలోని మల్లం చెరువు కట్టపై గల నాగదేవత ఆలయాలు, పుట్టల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు నాగదేవతకు నైవేద్యాలు సమర్పించి, పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని మల్లం చెరువు కట్టపై గల నాగులపుట్టతోపాటు చెరువు కట్టకింద వీరహనుమాన్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి.


