రూ.కోట్ల పెట్టుబడితో...!
సీఎం ఆదేశంతో రహస్య సమావేశం
ధాన్యం తీసుకున్న మిల్లర్లు సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ప్రభుత్వానికి ఇవ్వకుండా ఏళ్లతరబడి పెండింగ్లో పెట్టిన మిల్లర్లపై కొరఢా ఝుళిపించైనా రావాల్సిన డబ్బులను వసూళ్లు చేయాలని స్వయంగా సీఎం ఆదేశించటంతో, బకాయిపడ్డ మిల్లర్ల యాజమాన్యాల్లో వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే మొండి బకాయిదారులైనా 23 మిల్లర్లపై ఆర్ఆర్ యాక్టు ప్రయోగించగా..తాజాగా 60 మంది మిల్లర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో బకాయిలను బేషరతుగా వసూళ్లు చేయాలనే ప్రభుత్వ పెద్దల ఆదేశంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది. –మెదక్జోన్
జిల్లావ్యాప్తంగా బాయిల్డ్, రా రైస్మిల్లులు సుమారు 150 ఉన్నాయి. వీటిలో 83మంది మిల్లర్ల వద్ద 1,52,514 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి సకాలంలో సీఎంఆర్ ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి రూ.353.62కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో మొండి బకాయిదారులైన 23 మంది మిల్లర్లపై ఇప్పటికే ఆర్ఆర్ యాక్టు ప్రయోగించి కొంత వసూళ్లు చేయగా మిగతా 60 మంది మిల్లర్లు మాత్రం సర్కార్కు వ్యతిరేకంగా తాజాగా కోర్టు మెట్లెక్కారు. కాగా, బకాయి పడిన మిల్లర్లు కావాలని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పైకం ఎగ్గొట్టాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించటంతో మిల్లర్లు రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ గండం నుంచి బయట పడేదెలా..? అంటూ రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో నిగమ్నమైనట్లు తెలిసింది.
ఆర్ఆర్ యాక్టుతో రూ.16.74 కోట్లు వసూళ్లు!
జిల్లాలో 83 మంది మిల్లర్లు రూ.353.62 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా వాటిలో 23 మంది మిల్లర్లపై అధికారులు ఆర్ఆర్యాక్టు ప్రయోగించి ఇప్పటివరకు రూ.16.74 కోట్లు వసూళ్లు చేశారు. ఇంకా రూ.336.88 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. కాగా ఇందులో ఆ 23 మంది మిల్లర్లు చాలా ఏళ్లుగా 72,514 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.174.85 కోట్లు చెల్లించాల్సి ఉండగా వారిపై అధికారులు రికవరీ (ఆర్ఆర్యాక్టు) ప్రయోగించి రూ.16.74 కోట్లు వసూళ్లు చేశారు. అలాగే మిగతా 60 మంది మిల్ల్లర్లు 2022 ఏడాది రబీ సీజన్కు సంబంధించి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దింపుకుని సకాలంలో సీఎంఆర్ ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి ఒక్కో క్వింటాల్కు రూ.2,236 చొప్పున ధర నిర్ణయించిన ప్రభుత్వం రూ.178.88 కోట్లు చెల్లించాలని మిల్లర్లకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా అప్పట్లో ధాన్యం తడిసిపోయిందని, అంత ఇచ్చుకోలేమని క్వింటాల్కు రూ.1,900 చొప్పున ఇస్తామంటూ 60 మంది మిల్లర్లు కోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలో బకాయిపడిన మిల్లర్ల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేయటంతోపాటు బకాయిపడిన వారికి ఇక నుంచి ధాన్యం ఇవ్వద్దని సీఎం ఆదేశించటంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.
రైస్ మిల్లుల నిర్మాణాలను రూ.కోట్ల పెట్టుబడులు పెట్టి నిర్మించారు. ఇందులోభాగంగా రూ.10 కోట్ల నుంచి మొదలుకుని రూ.వంద కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి నిర్మించినట్లు తెలిసింది. అందులో చాలామంది బ్యాంకుల్లో అప్పులు తీసుకుని నిర్మించారు. కాగా, ప్రభుత్వానికి బకాయి పడిన మిల్లులు ఈ జాబితాలో ఎక్కువగానే ఉన్నాయి. కాగా, వాటి ఈఎంఐలను సక్రమంగా చెల్లించాలంటే సీఎంఆర్ దింపుకోవాల్సిందే. కానీ బకాయిపడిన మిల్లుల నుంచి డబ్బులను వసూళ్లు చేయటంతోపాటూ వాటికి ధాన్యం ఇవ్వొద్దని, ప్రభుత్వం ఆదేశించటంతో మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు.
గండం నుంచి బయట పడేందుకు వ్యూహాలు
రాజకీయనేతల ప్రసన్నానికి యత్నాలు
జిల్లావ్యాప్తంగా 83 మంది మిల్లర్లు..రూ.336.88 కోట్ల పెండింగ్


