ఆరుతడి పంటలపై దృష్టి
మెదక్ కలెక్టరేట్: జనాభా లెక్కలతోనే సరైన అభివృద్ధి జరుగుతుందని జిల్లా జనాభా లెక్కల హ్యాండ్ బుక్ అత్యంత ప్రామాణికమైందని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతోపాటు గురువారం వివిధ శాఖల అధికారులతో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్ బుక్ తయారీపై గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తు అభివృద్ధికి జనాభా లెక్కలు దోహదం చేస్తాయన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి రంగం సమగ్ర సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన 2027 సన్నాహకాల్లో మున్సిపల్, విద్య, వైద్య ఆరోగ్య, హౌసింగ్, ఆర్అండ్బీ వంటి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల వారీగా జనాభా వివరాలు నమోదు చేయడం, మౌలిక వసతులు, విద్య, వైద్యం పౌర సౌకర్యాల సమాచారం సేకరించాలని సూచించారు. డిజిటల్ యాప్లు లేదా వెబ్ పోర్టల్స్ ద్వారా కచ్చితమైన డేటాను క్రోడీకరించడం, రెవెన్యూ గ్రామాల స్థాయిలో అధికారుల ద్వారా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓలు రమాదేవి, రామకృష్ణ, బసవయ్య, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్
అనంతరం ఆరుతడి పంటలపై వ్యవసాయ అధికారులతో కలెక్టర్ గూగుల్మీట్ నిర్వహించారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని పంటల వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని తెలిపారు. వరి పంట సాగు కోసం ఎక్కువ నీరు అవసరమవుతుందని, ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు తగ్గడం వల్ల వరి పంటలు ఎండిపోయే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులపై వ్యవసాయ అధికారులు గ్రామాల్లోని గ్రామ సర్పంచులకు, రైతులకు ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, విస్తరణ అధికారుల తదితరులు పాల్గొన్నారు.


