పాపన్నపేట(మెదక్): నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న దౌలాపూర్ భూములకు పట్టాలు లేకపోవడంతో వారికి యూరియా అందడంలేదని గురువారం జరిగిన ఎంపీపీ సమావేశంలో సర్పంచులు పలువురు వాపోయారు. ఏళ్లు గడుస్తున్నా రైతులకు పట్టాలు అందడంలేదని, దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. పలు సమస్యల విషయమై తాము ఫోన్ చేస్తే అధికారులు స్పందించడం లేదని ఇతర సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్తివాడలో ఐదు వార్డులకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదని సర్పంచ్ శ్రీధర్ సభ దృష్టికి తీసుకెళ్లారు. పాపన్నపేట, రామతీర్థం గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొందని సర్పంచులు పావని, సాయిరెడ్డి వాపోయారు. ఏడుపాయల కమాన్, యూసూఫ్పేట, కొత్తపల్లి బ్రిడ్జి, ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద వర్షం కురిస్తే రహదారిపై ప్రయాణించలేని పరిస్థితి ఉందని వెల్లడించారు. సమావేశంలో డీఎల్పీవో యాదయ్య, ఎంపీడీవో విష్ణువర్ధన్, తహసీల్దార్ సతీశ్కుమార్, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మండల సర్వ సభ్య సమావేశంలో ఆవేదన


