జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రామాయంపేట(మెదక్): విద్యార్థినులు గర్భాశయ కేన్సర్ బారిన పడకుండా కేంద్ర వైద్యారోగ్యశాఖ హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రిలో గుర్తించిన విద్యార్థినులకు టీకా ఇవ్వనున్నారు. త్వరలో జిల్లాలో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే డాక్టర్లతో పా టు నర్సులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కాగా టీకా తీసుకుంటే భవిష్యత్తులో కేన్సర్ సోకే ప్రమాదాన్ని 90 శాతం వరకు తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు బాలికలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు.


