గుంట భూమి..
● సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరల సాగు
● తునికి ఆర్వీజే ఫీల్డ్ సూపర్వైజర్ వినూత్న ప్రయోగం
కౌడిపల్లి(నర్సాపూర్): ఇంటి అవసరాల కోసం స్థలం లేదు.. కోతుల బెడద ఉంది. నీళ్లు లేవు అంటూ సాకులు చెప్పే ప్రజలకు తమ ఇంటి వద్దే ఉన్న కాస్తంత స్థలంలో పంటలను సాగుచేసి ఆదర్శంగా నిలిచాడు మండలంలోని తునికి ఆర్వీజే (డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి) వ్యవసాయ కళాశాల ఫీల్డ్ కోఆర్డినేటర్ జగదీష్. తన ఇంటి ముందు ఉన్న గుంట స్థలంలో ఐరన్షెడ్ వేసి సేంద్రియ పద్ధతితో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నాడు. జగదీష్ మండలంలోని తునికి వద్దగల విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తన ఇంటి ముందు ఉన్న గుంట స్థలంలో కూరగాయల సాగు కోసం వినూత్న ప్రయోగం చేశారు. రూ 30వేలతో ఐరన్ జాలీతో షెడ్ వేశారు. అందులో టమాట, వంకాయ, రెడ్ క్యాబేజీ, గ్రీన్క్యాబేజీ, బ్రోకాలి, ఆకుకూరలు పాలకూర, తోటకూర, తీగజాత మొక్కలు పెంచుతున్నాడు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నామన్నారు. చీడ పీడల నివారణకు ఇంగువ, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నామని చెప్పారు. నాలుగు రోజులకు ఒకసారి భూమిలో కలుపు నివారిస్తూ నీటి తడులు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి రైతు తక్కువ స్థలంలో ఇంటి వద్ద కూరగాయలు సాగు చేసుకోవచ్చని జగదీష్ చెప్పారు.


