
సీసీ రోడ్లకు ఇక స్వస్తి
వీటి నిర్మాణంలో
భారీ అక్రమాలే కారణమా?
రైతులకు వ్యక్తిగత
లబ్ధి చేకూర్చే పనులకే ప్రాధాన్యం?
ఉపాధి హామీ పనులను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతుండటాన్ని పరిశీలించిన కేంద్ర బృందం ఆ పథకంలో పనుల ఎంపిక తీరును పూర్తిగా మార్చింది. సీసీ రోడ్లు నిర్మాణానికి ఉపాధి నిధులు పైసా కూడా విదిల్చేది లేదని హెచ్చరించడంతో ఈసారి ఉపాధి పనుల తీరు మారనున్నాయి.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ పథకం నిధులను ఏటా సీసీ రోడ్లు నిర్మాణానికి కేటాయించడం పరిపాటైపోయింది. ఈ సీసీ రోడ్ల నిర్మాణంలో అంతేస్థాయిలో అక్రమాలు సాధారణమైపోయాయి. మెటీరియల్ కాంపోనెంట్ కింద అందుబాటులో ఉన్న ఉపాధి హామీ నిధుల్లో సుమారు 80% ఈ సీసీ రోడ్లకే వెచ్చించే వారు. రాజకీయ పలుకుబడి ఉన్న స్థానిక గ్రామ పంచాయతీల తీర్మానాల పేరుతో మొక్కుబడి పనులు చేయడం, రూ.లక్షల్లో నిధులు నొక్కేయడం వంటివి పరిపాటిగా మారింది. కనీసం రెండు, మూడు దశాబ్దాలపాటు ఉండాల్సిన ఈ సీసీ రోడ్లు నాసిరకంగా రోడ్ల నిర్మించడంతో రెండు, మూడేళ్లకే పగుళ్లు రావడం, కంకర తేలి కనిపిస్తుండటాన్ని కేంద్ర బృందం పసిగట్టింది. దీంతో కేంద్ర బృందం ఈసారి సీసీ రోడ్లకు కేటాయింపులు తగ్గించాలని ఆదేశించింది. రెండు నెలల క్రితం జిల్లాలో రాయికోడ్, మొగుడంపల్లి మండలాలతోపాటు సిద్దిపేట, మెదక్ జిల్లాలోనూ కేంద్ర ఉన్నతాధికారుల బృందం పర్యటించి ఉపాధి పనుల తీరును పరిశీలించింది. రానున్న రోజుల్లో ఉపాధి పథకం నిధులతో సీసీ రోడ్లకు తగ్గించాలని సూచించింది. లేనిపక్షంలో బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర పేరుతో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పీఆర్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటిసరఫరా, స్వచ్ఛభారత్మిషన్ తదితర విభాగాల సమన్వయంతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఇందులో అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం వంటిపనులను చేపట్టింది.
పనుల జాతర తీరిలా..
సంగారెడ్డి జిల్లాలో ఈసారి రూ.19.59 కోట్ల వ్యయంతో 2,451 పనులను ప్రాఽరంభించారు. ఇందులో 62 అంగన్వాడీ, 27 గ్రామ పంచాయతీ భవనాలు ఉండగా మిగిలిన పశువుల పాకలు, గొర్రెల షెడ్లు వంటి వ్యక్తిగత పనులున్నాయి.
మెదక్ జిల్లాలో రూ.20.66 కోట్లతో 3,238 పనులను చేపట్టారు. ఇందులో 37 అంగన్వాడీ, 33 గ్రామపంచాయతీ భవనాలున్నాయి. మిగిలిన వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చే పనులను ఎంపిక చేశారు.
సిద్దిపేట జిల్లాలో 496 గ్రామపంచాయతీల్లో రూ.12.85 కోట్లతో 536 పనులను చేపట్టారు. ఇందులో అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు సుమారు 20 వరకు ఉంటాయి.
కేంద్ర బృందం హెచ్చరికలతో
మారిన ‘ఉపాధి’ పనుల ఎంపిక తీరు
వ్యక్తిగత వ్యవసాయ అనుబంధ పనులివే
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద వ్యవసాయ కూలీల వలసలను నివారించి..స్థానికంగా పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధి పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద వచ్చే మెటీరియల్ కాంపోనెంట్ నిధులను పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, ఫౌల్ట్రీఫాంలు, నాడెపు కంపోస్టు షెడ్లు, అజోల, చెక్డ్యాంలు, నీటి కుంటలు వంటి పనులకు వెచ్చిస్తున్నారు. గతేడాది సుమారు 80% ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులను సీసీ రోడ్లకు కేటాయించగా, ఈసారి పూర్తిగా తగ్గించామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ‘సాక్షి’తో తెలిపారు.