
వానొస్తే గుబులే...!
శిథిలావస్థలో పెద్దాస్పత్రి
● పెచ్చులూడి.. ఉరుస్తున్న వైనం ● భయాందోళనలో వైద్యులు, రోగులు
మెదక్జోన్: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. వర్షాలకు ఉరవటంతో తరచూ పై నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో రోగులు, వైద్యులు ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు వైద్య పరికరాలు లేక పోవటం కూడా రోగులకు శాపంగా పరిణమిస్తోంది. మెదక్లో 35ఏళ్ల క్రితం 120 బెడ్ల ఆస్పత్రిని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏరియా ఆస్పత్రిని.. కాస్త జిల్లా ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం అది శిథిలావ్యస్థకు చేరింది. భారీ వర్షాలకు ఉరుస్తోంది. దీంతో ఆస్పత్రి అంతా తడిసి ముద్దయింది. ఆపరేషన్ థియేటర్, ఇన్పేషంట్లు ఉండే గదులు తప్ప అంతటా ఉరుస్తోంది. అక్కడక్కడ పెచ్చులూడి పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు.
పరికరాలు లేక అందని వైద్యం
జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో వైద్యులతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెస ర్లు అందుబాటులో ఉన్నారు. కానీ పరికరాలు లేక పోవటంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందటంలేదు. ప్రస్తుతం డెంగీ వ్యాధి సోకి 14 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, అందులో ముగ్గురికి మాత్రమే చికిత్స అందించారు. మిగతా వారిని హైదరాబాద్కు రెఫర్ చేశారు.ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తే పరికరాలు లేక గాంధీ, ఉస్మానియా తదితర ఆస్పత్రులకు పంపుతున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గాంధీకి పంపుతున్నారు..
మెదక్కు చెందిన బాల మల్లయ్యకు కాలికి దెబ్బ తగిలి ఉబ్బింది పరీక్షించిన వైద్యులు.. వెంటిలె టర్పై ఉంచి వైద్యం చేయాల్సి ఉంది. ఆస్పత్రిలో వెంటిలెటర్ సౌకర్యం లేకపోవటంతో గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు.

వానొస్తే గుబులే...!