
ప్రభుత్వ మెడలు వంచుతాం
హామీలు అమలు చేయిస్తాం
● సగం మందికే రుణమాఫీ..
● సన్న వడ్లకు బోనస్ అందలేదు
● రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీశ్రావు
మెదక్ కలెక్టరేట్/మెదక్జోన్: ప్రభుత్వ మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్నాకు వచ్చిన రైతుల్లో ఎంతమందికి రుణమాఫీ కాలేదో చేతులు ఎత్తాలని కోరగా, 30 శాతం మంది చేతులు ఎత్తారు. అలాగే బోనస్ రాని రైతులు ఎంతమంది అని పేర్కొనగా.. అక్కడున్న వారంతా చేతులు ఎత్తారు. ఇదీ కాంగ్రెస్ సర్కారు తీరని ఎద్దేవా చేశారు. కాగా ధర్నా మధ్యలో హరీశ్రావుకు ఫోన్ రావడంతో మళ్లీ వచ్చి జాయిన్ అవుతానంటూ వెళ్లిపోయారు. అనంతరం నాయకులు కలెక్టరేట్కు వెళ్లి డీఆర్ఓ భుజంగరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశధర్రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్గౌడ్, పార్టీ నాయకులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కాంగ్రెస్– బీజేపీ మిలాఖత్:
మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్లు మిలాఖత్ అయ్యా యని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మోదీ, రేవంత్ కేసీఆర్ మీదికి ఒంటికాలిపై లేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేవలం ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డి, మహేశ్వర్రెడ్డి తప్ప, మిగితా వారంతా రేవంత్రెడ్డికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరువందల రోజులవుతుండగా, ఇప్పటికీ 600 రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. బీజేపీకి రైతుల మీద ప్రేమ లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతులు ఎరువుల కోసం చెప్పులు వరుసలో పె ట్టాల్సిన దుస్థితి మళ్లీ వచ్చిందని వాపోయారు. కృష్ణా, గోదావరి నీళ్లు నియంత్రణ లేక గంగలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను వీడిన వారంతా సొంత గూటికి రావడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు.
ప్రాజెక్టుల గేట్లు బద్దలు కొడతాం:
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
మూడు రోజుల్లో జిల్లాకు సాగునీరందించే ప్రాజెక్టుల నుంచి కాల్వలకు నీరు విడుదల చేయకపోతే ప్రాజెక్ట్ల గేట్లు బద్దలు కొడతామని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నీళ్ల మంత్రి ఉత్తమ్ జిల్లాకు నీరందించే ప్రాజెక్టులపై ఒక్కసారి కూడా సమీక్ష జరిపిన పాపానపోలేదన్నారు. జిల్లా మంత్రి దామోదరకు ఎంతసేపు కమీషన్ల ధ్యాసే తప్ప.. రైతుల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడంతో వివేక్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారన్నారు.జగ్గారెడ్డికి మంత్రులు కమీషన్లు ఇవ్వడం లేదని ఏడుస్తున్నారని ఎద్దేవాచేశారు. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు పైసా నిధులు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగితే బాగు చేయలేదన్నారు. మెదక్ కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు, ఇది సరికాదు, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
ఇచ్చిన హామీలు గాలికి: పద్మారెడ్డి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీ లను గాలికి వదిలేసిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ను బూచిగా చూపిస్తున్నారని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం ఇది ఆరంభం మాత్రమే అన్నారు. కేసీఆర్పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాంత్రి కిరణ్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హా మీలను విస్మరించిన సీఎం రేవంత్కు ప్రజ లు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తే కాంగ్రెస్ దానిని నాశనం చేసిందన్నారు.