
ఓపీఎస్లకు వేతనాలేవి?
ఆరు నెలలుగా ఉద్యోగుల ఇబ్బందులు
మెదక్జోన్: ఆరు నెలలుగా వేతనాలు అందక ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 492 గ్రామాలు ఉండగా, 44 మంది ఓపీఎస్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 2021లో విధుల్లో చేరిన వీరు రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో నాలుగేళ్లుగా నామమాత్రపు వేతనంతో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తుంది. కాగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి ఇప్పటికీ వేతనాలు రాలేదు. ఆర్డర్ కాపీ ట్రెజరీకి రాకపోవడంతో వేతనాలు విడుదల కానట్లు తెలుస్తోంది.
గోటి చుట్టపై రోకలి పోటు
అసలే ఔట్సోర్సింగ్ ఉద్యోగం, నామమాత్రపు వేతనంతో జీవనం సాగిస్తున్నారు. ఆరు నెలలుగా జీతాలు రాకపోగా, వీరు విధులు నిర్వహించే పంచాయతీల్లో చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ పోయించడం, ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహిస్తే అందుకు సంబంధించిన ఖర్చులు సైతం అప్పులు చేసి వెచ్చిస్తున్నామని పలువురు ఓపీఎస్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిత్యం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి ఆన్లైన్ సిస్టం ద్వారా ఫొటో దిగి పంపించడంతో పాటు ప్రభుత్వం అప్పగించే ప్రతి పనిని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాల్లో ప్రతిరోజు లబ్ధిదారులతో మమేకమై వారికి తగు సలహాలు, సూచనలు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను నిర్ధేశిత గ్రూప్లలో పోస్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే లబ్ధిదారులకు బిల్లులు రాకుండా పోతాయి. వీటిన్నంటిని భరిస్తున్న ఓపీఎస్లు రాబోయే రోజుల్లో రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో పనిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ, ఏడాదిన్నరగా సర్పంచ్లు లేక పంచాయతీల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఒక్కొక్కరం రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు అప్పులు చేసినట్లు పలు వురు ఓపీఎస్లు వాపోయారు.
ఆర్డర్ రాకపోవడంతోనే..
ఓపీఎస్లకు మే, జూన్, జూలైకి సంబంధించి వేతనాలు వచ్చాయి. కాని ప్రభుత్వం నుంచి ఓపీఎస్ల కంటిన్యూ ఆర్డర్ రాలేదు. అందు వల్లనే వారికి ట్రెజరీలో బిల్లులు పాస్కాలేదు. అలాగే కొంత మందికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి వేతనాల విష యంలో ఆయా ఎంపీడీఓలు బిల్లులు పెట్టలేదు. అందుకే వారికి వేతనాలు రాలేదు.
– యాదయ్య, డీపీఓ