
డోర్లు బిగించారు.. నిర్వహణ మరిచారు
హవేళిఘణాపూర్(మెదక్): జిల్లా కలెక్టర్ వస్తున్నాడనే హడావిడితో మండల కేంద్రమైన హవేళిఘణాపూర్లో వినియోగంలో లేని మరుగుదొడ్లకు వ్యవసాయ అధికారులు డోర్లు బిగించి చేతులు దులుపుకున్నారు. ఈ నెల 25న భూ భారతి కార్యక్రమం రైతువేదికలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్రాజ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. దీంతో హడావిడిగా వ్యవసాయ శాఖ అధికారులు అపరిశుభ్రంగా ఉన్న వాటికి డోర్లు బిగించి తాళాలు వేసి వదిలివేశారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మిస్తే కేవలం నీరు లేదనే సాకుతో ఇలా నిర్లక్ష్యంగా వదిలివేస్తే ఎలా అని, మౌలిక వసతులు కల్పించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏవో కార్యాలయం ప్రైవేటు భవనంలో కొనసాగగా.. అద్దె చెల్లించలేక హవేళిఘణాపూర్ రైతువేదికకు మార్చారు. అధికారులు కనీసం మరుగుదొడ్లను బాగు చేయించుకొని వినియోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతువేదికలో నిరుపయోగంగా
మరుగుదొడ్లు
వ్యవసాయ అధికారుల తీరుపై
రైతుల ఆగ్రహం