
తాగునీటి కోసం తండ్లాట
నర్సాపూర్ రూరల్: మండలంలోని ఎల్లారెడ్డి గూడ పంచాయతీ పరిధిలోని జయరాం, ప్రేమ్నగర్, అచ్య, ఎల్లారెడ్డిగూడ గిరిజన తండాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. తండాల్లోని బోరు మోటార్లు చెడిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టడం లేదు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సైతం సరఫరా కాకపోవడంతో గుక్కెడు నీటి కోసం గిరిజనులు అలమటిస్తున్నారు. తండాలకు దూరంగా ఉన్న వ్యవసాయ బోరు మోటార్లను ఆశ్రయించి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. కొన్నిసార్లు రైతులు తమ పంటలకు సరిపోను నీరు రావడం లేదని నీరిచ్చేందుకు నిరాకరిస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ మధులతను వివరణ కోరగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
వ్యవసాయ బోరు నుంచి తాగునీరు తీసుకెళ్తున్న గిరిజనులు