
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డీపీఓ యాద య్య సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని వెంకట్రావుపేట, ముట్రాజ్పల్లి గ్రామాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పంచాయతీల్లో రికార్డులు తనిఖీ చేసి పరిసరాలను సందర్శించారు. పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ, డంపుయార్డ్, వైకుంఠధామం పరిశీలించారు. అన్ని గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం పాటించడంతో పాటు మురికి కాలువలు, రోడ్లు శుభ్రంగా ఉండాలన్నారు. చెత్తను సేకరించి డంపుయార్డుకు తరలించాలని చెప్పారు. నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామా ల పంచాయతీ కార్యదర్శులు ఇట్యనాయక్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సహకరిస్తేనే
రామాయంపేట ప్రగతి
రామాయంపేట(మెదక్): రామాయంపేట ప ట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని పలు పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. శనివారం మహంకాళీ ఆలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేట మళ్లీ నియోజకవర్గ కేంద్రంగా రూపు దిద్దుకునే అవకాశం ఉందని, ఈలోగా పూర్థిస్థాయిలో అభివృద్ధి సాధించాలని స్థానికులు సూచించారు. పీసీసీ సభ్యుడు సుప్రభాతరావు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి విషయమై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృష్టి సారించారని తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ కోసం వ్యాపారులు కొంత నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అశ్విని, నాయకులు దోమకొండ రాములు, బీజేపీ నాయకుడు శంకర్గౌడ్, తదితరులు మాట్లాడారు. వ్యాపారులు, కుల సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మే 2న కలెక్టరేట్ ఎదుట
మహా ధర్నా
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మే 2న కలెక్టరేట్ ఎదుట 24 గంటల మహాధర్నా చేపట్టనున్నట్లు ఎన్పీఆర్డీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కవిత తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్ వద్ద ఆమె మాట్లాడారు. 2010 నుంచి పెన్షన్ పొందుతున్న ప్రతి వికలాంగుడికి యూడీఐడీ కార్డు పంపిణీ చేయాలన్నారు. అలాగే స్వయం ఉపాధి కోసం దరఖా స్తు చేసిన ప్రతి వారికి వెంటనే ఎలాంటి షరతు లేకుండా రుణాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి, రాణి, అమూల్య తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం సందర్శన
తూప్రాన్: మండలంలో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్డీఓ జయచంద్రారెడ్డి శనివారం పర్యవేక్షించారు. ఈసందర్భంగా ధాన్యం సేకరణ విధానం, నాణ్యత పరీక్షలు, చెల్లింపు ప్రక్రియ గురించి ఆరా తీశారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయా..? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సేకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయలక్ష్మి సిబ్బంది ఉన్నారు.
పులి సంచారం..
భయాందోళనలో జనం
చేగుంట(తూప్రాన్): పులి సంచరిస్తుందన్న ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి, పోతాన్పల్లి తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పిల్లలతో తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లో చాటింపు వేయించారు.

పారిశుద్ధ్య పనులు చేపట్టాలి