
‘భూ భారతి’తో రైతులకు మేలు
కలెక్టర్ రాహుల్రాజ్
హవేళిఘణాపూర్(మెదక్)/చిన్నశంకరంపేట: భూ భారతి చట్టం ద్వారా ప్రజలందరికీ సమన్యాయం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం హవేళిఘణాపూర్ రైతు వేదికలో ఎమ్మెల్యే రోహిత్రావుతో కలిసి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి తీసుకొచ్చిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరణి ద్వారా కేసీఆర్, అతడి కుటుంబ సభ్యులకు మాత్రమే లాభం జరిగిందన్నారు. భూ భారతి చట్టం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, వ్యవవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. అలాగే నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ధరణితో ఇబ్బంది పడిన రైతులు భూ భారతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. జూన్ 2 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు.
నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలి
మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన పక్కాగా జరగాలని, నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ నుంచి హౌసింగ్ పీడీ మాణిక్యం, డీపీఓ యాదయ్యతో కలిసి ఎంపీడీఓలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని 21 మండలాలతో పాటు మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 67 మంది వెరిఫికేషన్ అధికారులను నియమించినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెలాఖరు వరకు పూర్తి కావాలని ఆదేశించారు.