
దళారులను నమ్మి మోసపోవద్దు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
కొల్చారం(నర్సాపూర్): దళారులకు ధాన్యం అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో రాంపూర్, పైతర, కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులకు బకాయి ఉన్న బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో గ్రా మాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగంపేట పీఏసీఎస్ చైర్మన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, ఉపాధ్యక్షుడు మల్లేశం, తహసీల్దార్ గఫార్ మియా, ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, ఏఓ శ్వేతా కుమారి, ఏఈఓలు అంబికా, రోజా బీఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.