
రైతుకు ‘గుర్తింపు’
అన్నదాతల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతీ రైతుకు ‘ఆధార్’ మాదిరి 11 అంకెల ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తూ గుర్తింపు కార్డుల జారీకి చర్యలు చేపడుతోంది. ఈనెల 22 నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు శిక్షణ సైతం పూర్తయింది. – మెదక్జోన్
ఆధార్ తరహాలో 11 అంకెల సంఖ్య రేపటి నుంచే శ్రీకారం ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తి
రైతుల సమగ్ర వివరాలను ఒకే చోట పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రైతు పూర్తి డేటాను సేకరించి 11 అంకెల ప్రత్యేక నంబర్ను కేటాయించనుంది. ఆ నంబర్ క్లిక్ చేస్తే చాలు రైతు పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలుస్తాయి. సర్వే నంబర్లు, రైతు స్వగ్రామం, భూమి ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది. అది సారవంత మైనదేనా..? ఆ భూమి ఏ పంటలకు అనువైనవిది.. దానిపై సదరు రైతుకు బ్యాంకు ఎంత అప్పు ఇవ్వొచ్చు, అంతే కాకుండా సబ్సిడీ వ్యవసాయ పరికరాలు, రసాయన ఎరువులతో పాటు పీఎం సమ్మాన్ నిధి, పంటనష్ట పరిహారం తదితర పూర్తి వివరాలను అందులోనే పొందుపరచనున్నారు. ఇక నుంచి బ్యాంకు రుణం కోసం పట్టాపాస్బుక్, ఇతర పత్రాలను అధికారులకు చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం రైతుకు కేటాయించిన 11 అంకెల డిజిట్ నంబర్ను సదరు అధికారికి చెబితే సరిపోతుంది. ఇందుకు సంబంధించి ఈనెల 15వ తేదీన హైదరాబాద్లో జిల్లాకు చెందిన ఇద్దరు అధికారుల శిక్షణ పొందారు. వారు ఈనెల 17న కలెక్టరేట్లో ఏఈఓలు, ఏఓలతో పాటు ఇతర అధికారులకు వివరించారు. కాగా ఈనెల 22 నుంచి ఆయా గ్రామాల రైతులు వారి పట్టాపాస్ పుస్తకం, ఆధార్కార్డుతో పాటు ఫోన్ నంబర్ను మండల వ్యవసాయశాఖ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల డేటాను పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత సదరు రైతు ఫోన్కు 11 అంకెలు గల ఐడీ నంబర్ వస్తోంది. దానిని రైతు భద్రంగా ఉంచుకోవాలి. రుణం కోసం బ్యాంకుకు వెళ్లినా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పడకపోయినా, సంబంధిత అధికారికి ఈ నంబర్ చెబితే సరిపోతుంది.
వివరాలు తప్పనిసరి
ఈనెల 22 నుంచి రైతులు వారి ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్లు తీసుకొని ఆయా మండలాల వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఏఈఓలు, ఏఓలకు వాటిని అందించడంతో పాటు ఫోన్ నంబర్ తప్పనిసరిగా చెప్పాలి. వారు ఆన్లైన్ నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెలు గల గుర్తింపు నంబర్ను ఇస్తారు.
– వినయ్, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి
జిల్లాలో 2.91 లక్షల మంది రైతులు
జిల్లాలో 4.50 లక్షల ఎకరాలు వ్యవసాయ భూములు ఉండగా, అందులో 3,92,904 సారవంతమైన భూములు ఉన్నాయి. రైతులు 2,91,399 మంది ఉన్నారు. నెలరోజుల వ్యవధిలో రైతుల వివరాలను ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’లో పొందుపరిచి ప్రతి రైతుకు పదకొండు అంకెలు గల విశిష్ట గుర్తింపు నంబర్లను ఇవ్వనున్నారు.