
అనాథ పిల్లలకు అండగా ఉంటాం
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం కుర్తివాడలో అనాథలుగా ఉన్న పిల్లలకు అండగా ఉంటామని డీడబ్ల్యుఓ హైమావతి, డీసీపీఓ కరుణశీల అన్నారు. బుధవారం వారు బాధితుల పూరిగుడిసెను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కుర్తివాడకు చెందిన భూతిపురం రవి గతంలో ప్రమాదవశాత్తు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు సంతానం. వారిని పోషించడం భారంగా మారడంతో తల్లి సంపూర్ణ పిల్లలను వదిలేసి వెళ్లింది. దీంతో దూరపు బంధువులు ఇద్దరు ఆడపిల్లలను, అబ్బాయిని వసతి గృహాల్లో చేర్పించి చదివిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు వస్తుండటంతో వసతి గృహాలు మూతపడనున్నాయి. ఇంటికి వచ్చి ఉందామంటే పూరి గుడిసెలో ఉండలేని పరిస్థితి.ఈ విషయం తెలుసుకున్న డీడబ్ల్యుఓ హైమావతి, డీసీపీఓ కరుణశీల, ఐసీడీఎస్ సూపర్వైజర్లు వివరాలు సేకరించారు.