ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే.. | Major Financial Changes From April 1st | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..

Apr 1 2024 2:29 PM | Updated on Apr 1 2024 2:29 PM

Major Financial Changes From April 1st

ఏప్రిల్‌ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్‌పీఎస్‌ లాగిన్‌తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్‌వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్‌పీఎస్‌లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.

ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్‌బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది.

ఫ్రీలాంజ్‌ యాక్సెస్‌..

ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్‌ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.

పాలసీ డిజిటలైజేషన్

ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement