చెన్నూర్/చెన్నూర్రూరల్/మందమర్రిరూరల్/కోటపల్లి: చదువుతోనే బంగారు భవిష్యత్కు పునాది పడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. చెన్నూర్ పట్టణంలోని మహిళా భవనంలో, మందమర్రిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా బుధవారం కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సై, పోలీసు ఉచిత శిక్షణ కేంద్రాలు, చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.1.45కోట్లతో నిర్మించిన మొదటి అంతస్తును పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి ప్రారంభించారు. కోటపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో రూ.50లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు నెలలపాటు భోజన వసతితో కూడిన శిక్షణ అందిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉన్న యువతీ, యువకులు శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కోటపల్లి మండలం సోమనపల్లి గ్రామంలో రూ.250 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించకున్న తెలంగాణలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అనంతరం ఉచిత శిక్షణ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, డీసీపీ భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, మార్కెట్ చైర్మన్ మహేశ్ప్రసాద్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


