మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం నిర్దేశించిన 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు, డిజిటల్ బోధనతో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. శనివారం యుడైస్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నివేదికను కలెక్టర్ కుమార్దీపక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారితో కలిసి వెల్లడించారు.
ఎన్రోల్మెంట్ ఇలా..
గతేడాది 43,072 విద్యార్థుల సంఖ్యకు 10 శాతం అదనంగా 4,307 కలిపి మొత్తం 47,379 మందిని చేర్పించాలని లక్ష్యాన్ని విధించింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,350కు చేరింది. ఇప్పటి వరకు 2,778 మంది కొత్తగా చేరారు. ఈలెక్కన 95.72 శాతం నిర్దేశిత లక్ష్యం సాధించి జిల్లా తొలిస్థానాన్ని దక్కించుకుంది. మందమర్రి, జైపూర్ మండలాలు 100 శాతం, హాజీపూర్ 99.91, నస్పూర్ 99.76, భీమారం, 98.24, నెన్నెల 98 శాతం సాధించి ముందు వరుసలో నిలిచాయి. 18 మండలాలకు 10 మండలాలు 96 శాతం నుంచి 100 శాతం ప్రగతి సాధించాయి.
ప్రైవేట్ నుంచి సర్కారు బడికి..
ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూకట్టారు. ఫీజుల భారం లేకపోవడం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, ఇతరత్రా సౌకర్యాలతో సర్కారు బడిబాట పట్టారు. ఈవిద్యాసంవత్సరానికి సంబంధించిన వివరాల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన వారు 91.67 శాతం కాగా సర్కారు బడుల నుంచి ప్రైవేట్కు వెళ్లిన వారి సంఖ్య 8.33 శాతం ఉంది. ప్రభుత్వ బడుల్లో 3,315 మంది చేరగా తిరిగి వెళ్లిన విద్యార్థులు 301 మంది ఉన్నారు. మంచిర్యాల మండలం నుంచి అత్యధికంగా 514 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జన్నారంలో 391, మందమర్రిలో 371, బెల్లంపల్లిలో 305 మంది సర్కారు బడికి జైకొట్టారు.


