● తక్కువ ఖర్చుతో పత్తిలో
రసం పీల్చే పురుగు నియంత్రణ
● అలంపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి
అలంపూర్: బీటీ పత్తి పంటలో రసం పీల్చే పురుగులు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. అన్నీ ప్రైవేటు కంపెనీలు విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధి వల్ల మొదటి 20రోజుల వరకు పత్తి మొక్కలకు రసం పీల్చే పురుగులను తట్టుకోనే శక్తి ఉంటుంది. ఆ తర్వాత వాటికి వివిధ ఖరీదైన మందులు పిచికారీ చేసే బదులు తక్కువ ఖర్చుతో కాండానికి మందు పూసి లేదా బొట్టు పెట్టి పురుగులను నియంత్రించవచ్చునని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి తెలిపారు.
బొట్టు పద్ధతి వల్ల లాభాలు
పెట్టుబడి తగ్గుతుంది. మిత్ర పురుగులు చనిపోకుండా ఉంటాయి. పర్యావరణ కాలుష్య తగ్గుతుంది. రసం పీల్చే పురుగులను బాగా నియంత్రించవచ్చు. పెట్టుబడిలో పురుగు మందుల ఖర్చు తక్కువగా ఉంటుంది.
బొట్టు పద్ధతి విధానం
ఒకవంతు మోనోక్రోటోపాస్ మందు తీసుకోని దానికి నాలుగు వంతుల నీరు కలుపుకోవాలి. ఉదాహరణకు 100 మి.లీ మోనోక్రోటోపాస్ మందు తీసుకుంటే 400 మి.లీ నీరు కలపాలి. ఈ మందు మిశ్రమాన్ని వేపపుల్లతో లేదా కాండానికి మందు పెట్టే బ్రష్తో (మార్కెట్లో లభిస్తోంది) మొక్క కాండంపై ఎరుపు రంగుపైన లేత ఆకుపచ్చగా ఉన్న కాండంపై పూతగా బొట్టు పెట్టాలి. ఇలా 20రోజుల వ్యవధిలో రెండుసార్లు చేస్తే పత్తి పంటను 60రోజుల వరకు ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకుండానే కాపాడుకోవచ్చు. నాటిన 20, 40, 60రోజులకు ఒకసారి ఈ పద్ధతి పాటించాలి. అవసరాన్ని బట్టి వేప కషాయం 5శాతం లేదా వేపనూనె (1500పీపీఎం) మందును లీటర్ నీటికి 5మిల్లీ లీటర్లు కలిపి సాయంత్రం సమయాల్లో పంటపై పిచికారీ చేస్తే రసం పీల్చే పురుగులను ఆరికట్టవచ్చు. ఈ రెండు విధానాలను పాటించడం వల్ల కీడు చేసే పురుగులు నశించి మేలు చేసే మిత్ర పురుగులు బతికి ఉంటాయి. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంట చేతికి వస్తోంది.
పాడి–పంట


