● సున్నపుతండా వద్ద ‘మిషన్ భగీరథ’పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి
కొల్లాపూర్ రూరల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు తాగునీటిని తరలించేందుకు కొల్లాపూర్ మండలం సున్నపుతండా సమీపంలో చేపడుతున్న పంపింగ్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పరిశీలించారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కేఎల్ఐ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే నీటి ప్రవాహం తగ్గడంతో రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని తరలించేందుకు సున్నపుతండా సమీపంలోని పాలమూరు ప్రధాన కాలువ వద్ద సుమారు రూ.200 కోట్లతో పంపింగ్ పనులు చేపడుతున్నారు. పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తిచేయాలని సూచించారు. ఎక్కడైనా పనులకు అడ్డంకులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అమర్సింగ్, అధికారులు పాల్గొన్నారు.


